Tuesday, August 17, 2010

శ్రీరామ్ కి ఫస్ట్ వస్తే తెలుగోళ్లకేంటి?

అందరూ indian idol లో తెలుగు తేజం అంటూంటే నేను కూడా ఉత్సాహంగా ఒకట్రెండు తెలుగు ఛానళ్ల వాళ్ళు ఈ పోటీ గురించి, ఈ పోటీలో అతను పాడిన పాటలను చూపిస్తూ వేసిన కార్యక్రమాలు చూసాను. ఇక పోతే ఇక్కడ నేను మాట్లాడేది అతను బాగా పాడాడా లేదా అన్న విషయం కాదు, అతను అందరికన్నా బాగా పాడాడు. అయితే నాకేంటి? ఆ కార్యక్రమం నేను చూడటానికి ఏకైక కారణం అతను తెలుగు వాడు కాబట్టి. ఇక ఆ కార్యక్రమం లో హేమమాలిని అతన్ని రెండు మూడు ప్రశ్నలు తెలుగు లో అడిగింది. అతను ఒకట్రెండు ప్రశ్నలకు తెలుగు లో జవాబు చెప్పి ఆమె తెలుగు లో మాట్లాడుతున్నా ఇతడు హిందీ అందుకున్నాడు. సరే కదా అని ఆ కార్యక్రమం చూస్తుంటే ఒకళ్లెవరో మీ south కి సంబంధించిన ఒక dialog చెప్పండి అని ఎవరో అడిగారు అతన్ని. వెంటనే అతను రజనీకాంత్ ఏదో ఒక సినిమాలోని ఒక తమిళ డైలాగ్ చెప్పాడు. కనీసం రజనీకాంత్ నటించిన తెలుగు డైలాగ్ ఏమన్నా చెప్పినా నాకు ok అనిపించేదేమో.
మరి అతను ఎన్ని పాటలు పాడాడో అందులో తెలుగు పాటలు ఎన్ని ఉన్నాయో నాకు అసలు తెలియదు. జాతీయ స్థాయి లో వచ్చే కార్యక్రమం లో అతను కల్పించుకు మరీ తెలుగు పాట పాడాల్సిన అవసరం లేదు, తెలుగు మాటలు మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ ఒకళ్లు request చేసిన తర్వాత కూడా అతను తెలుగు కి అంత ప్రాముఖ్యత ఇవ్వకపోవటం నాకు నచ్చలేదు. కాబట్టి నేను vote వెయ్యలేదు.

14 comments:

Anonymous said...

నిన్న కారుణ్య, ఈ అబ్బాయి (శ్రీరాం) లైవ్ షో టి.వి 9 లో. ఇద్దరూ మొత్తం ఇంగ్లీషులోనే మాట్లాడారు. తెలుగు ప్రేక్షకుల కోసం ఒక తెలుగు పాట పాడండి అంటే మా తుఝే సలాం అంటూ అందుకున్నాడు. తెలుగు పాటల సాహిత్యం గుర్తులేదట. తెలుగు, మన తెలుగువాడు అంటూ మనం గుండెలు బాదేసుకోవడమే. వాళ్ళకేంలేదు.

పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి) said...

శ్రీరాం ఇండియన్ ఐడల్ అవ్వగానే మన ఛానళ్ల వాళ్ళు చుట్టుముట్టినప్పుడు"ఈసారి మన ప్రతిభ,కార్యక్రమానికి వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళ ప్రోత్సాహం,మీడియా కృషి,తెలుగు ప్రజల ప్రయత్నం,అందరి పట్టుదల సరిగ్గా సరిపోయాయి.
ఇండియన్ ఐడల్ 5 లో మొదటి నుంచీ అన్నీ సక్రమంగా సవ్యంగా జరిగాయి అందుకే గెలిచాను",అని అచ్చ తెలుగులో(మిగతా ముఖాముఖీ అంతానూ)చెప్పడం చూసి పులకించిపోయాం మా ఇంట్లో వాళ్లం అంతా.
వాళ్ల బామ్మతో ఫోన్ లో మాట్లాడుతూ"ఆరోగ్యం ఎలా ఉంది మందులు సరిగ్గా వేసుకో,మావిడికాయ పప్పు ఊరమిరపకాయ చెయ్యి వచ్చి భోజనం చేస్తాననడం" కూడా ముచ్చట కలిగించింది.
మరి మీరు అవి చూడలేదా.
ఐనా ఛానళ్ళు చాలా ప్రోగ్రాములు చేసుకున్నాయి లెండి.అందరూ అన్నీ చూడడం కష్టమే.
----సంతోష్ సూరంపూడి.

పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి) said...
This comment has been removed by the author.
Anonymous said...

మీరు చెప్పింది సబబుగా అనిపించింది. 'అంతర్యానం ' పెద్దమనిషి చెప్పాడు కదా అని నేనూ ఓ ఫోన్ చేసి ఇండియన్ ఐడోల్ అంటే ఏమిటో తెలియని వాళ్ళతో చెప్పి 8 ఓట్లు వేయించాను. మనవాళ్ళు వుట్టి చవటాయిలోయ్ అని వూరికే అన్నారా. అలాంటి 30ఏళ్ళ వరకూ నభూతో న భవిష్యతి అనే మహాగాయకుడు, బొంబాయికి మకాం మార్చి పంజాబీ పాటలు పాడతాడట మనం బ్లాగుల్లో భల్లే భల్లే భల్లే అని భంగ్రా ఆడుకుందాం లెండి. ప్చ్.. ఏదో లేండి, ISD ఫోన్లు, SMS ల బిల్లు రాగానే కట్టుకుందాము. :)

నాగప్రసాద్ said...

నేను చూసినప్పుడు అతను తెలుగు బాగా మాట్లాడాడు... అలాగే చక్కగా తెలుగు పాట కూడా పాడాడు. కేవలం, ఈ ఒక్క కారణం చేతనే, అతనికి ఓటేశాను నేను. కానీ, మీరు చెప్పేది విరుద్ధంగా ఉంది... బహుశా, మీరు చెప్పింది చూసి ఉంటే, నేను కూడా ఓటేసేవాడిని కాదేమో. :-)

కొత్త పాళీ said...

Interesting.

ఐనా నా ఉద్దేశంలో ఇది ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం కాదు. అతనకి మనవాళ్ళు వోటెయ్యడం అన్నది, అతను తెలుగుకి ఏదో చేశాడు, చేస్తాడూ అని కాదు, కేవలం తెలుగు పుటక పుట్టి ఉండడమే కారణం. ఆ మాత్రం జాత్యభిమానం తెలుగు వాళ్ళకి ఈ విషయంలోనైనా కలిగినందుకు నాకు సంతోషంగానే ఉంది.

మైత్రేయి said...

అదేంటండి, ఆ అబ్బాయి తెలుగు డప్పు డాన్స్ చేసే వాడు,
జింతాత్త పాట ఉషా ఊతుప్ తో పాడించాడు.
అదీ కాక ఒక దేశవ్యాప్తంగా వచ్చే కార్యక్రమంలో మన రాష్ట్రంలో పుట్టి పెరిగిన వాడు కూడా గెలవగలనని చూపించాడు. అది చాలా తెలుగు వాళ్లకు ఇన్పిరేషన్ కదా.
హేమచంద్ర చెప్పినట్లు మనం హిందీ వాళ్ళను కూడా ఓడించగలిగినప్పుడు కనీసం తెలుగు సినిమాల్లో నయినా హిందీ వాళ్ళను పిలవకుండా తెలుగు సింగర్స్ చేత పాడించవచ్చు అని తెలుగు నిర్మాతలు మైన్డ్ సెట్ మార్చుకోవచ్చు.

Anonymous said...

కొన్ని నేలలు జరిగిన ఈ ప్రోగ్రాం లో అతను పాడవలసింది హిందిలో ఐనపుడు వాటి మీదె దృష్టి పెట్టి ఉంటాడు. అతను హింది,ఉర్దూలు పలకటం కోసం ఎంతో కృషి చేసి ఉంటాడు. దాని వలన కొంచెం తెలుగు పాటల సాహిత్యం మరచి పోయి ఉండవచ్చు అదేమి పెద్ద తప్పు కాదు. అతను ఖ్వాజా మెరీ ఖ్వాజా పాటను ఒరిగజినల్ దాని కన్న ఎంతో బాగా పాడాడని పినించింది. అన్ని రోజులు ఆ ప్రోగ్రాం కి ప్రిపేర్ అవుతూ ఉన్నట్టుండి తెలుగులో పాట పాడు అంటె కష్టమేమరి.ఎమైనా తెలుగు వారి ఖ్యాతి పారదర్శకం గా జాతీయ స్థాయి కి ఈ మధ్య తీసుకెళ్ళిన వాడు ఇతను ఒక్కడె. మిగతా రంగాలలొ మనకు ఉన్నారుగా ఒక సత్యం కంపెని వ్య్వహారం,రాజకీయ అవినితి,ఫేక్ సర్టి ఫికేట్ల తో ఐ.టి. ఉద్యోగాలు ఇటువంటి వాటి లో తెలుగు వారు జాతీయ స్థాయిలో ప్రసిద్దులు. అటువంటి ఇమేజ్ ని ఇతను కొంచెం మార్చగలిగాడు తన ప్రతిభతో ..

పానీపూరి123 said...

> కానీ ఒకళ్లు request చేసిన తర్వాత కూడా అతను తెలుగు కి అంత ప్రాముఖ్యత ఇవ్వకపోవటం నాకు నచ్చలేదు
అది ప్రతి తెలుగోడూ చేసే పనే.

Truely said...

"శ్రీరామ్ కి ఫస్ట్ వస్తే తెలుగోళ్లకేంటి " -- బాగుంది అండి ఇండియా కి హాకీ లో olympic గోల్డ్ మెడల్ వస్తే నాకు ఏంటి అన్నట్లు ఉంది. లాభ నష్టాలు భేరీజు వేసుకోవటానికి ఇది ఏమైనా వ్యాపారమ ?
రహమాన్ కి ఆస్కార్ అవార్డు వస్తే నాకేంటి అన్న తమిళుడు ఉంది ఉండడు. గతం లో రెండు సార్లు ఫైనల్ దాక వచ్చి వెనుదిరిగిన కారుణ్య, హేమచంద్ర ను చూసినప్పుడు మన తెలుగు వాళ్ళు ఎంతో మంది అవమానం గా ఫీల్ ఐయ్యారు . ఈ సారి అనటువంటి పరాభవం జరగకుండా ప్రతి తెలుగువాడు SMS వోట్ వేసి తెలుగు వాడిని వాడి ప్రతిభని యావత్ భారతావనికి చాటి చెప్పారు. శ్రీరామ్ ని కాకుండా తెలుగువాడి ప్రతిభని గెలిపించాలి అన్న ఉద్దేశం తో మీరు SMS వోట్ వేసి వుంటే ఎంతో బాగుండేది. శ్రీరామ్ తెలుగు లో పాడమన్నప్పుడు, పాడిన పాడక పోఇన అతను తెలుగు వాడే.

hkpt said...

నా మటుకైతే మైనంపాటి శ్రీరాం గారు పేరుకీ పుటకకీ మాత్రమే తెలుగు వాడు. నాకు హిందీ ఆట్టే రాదు. అతను చాలా గొప్పగా పాడుతున్నాడని కొన్ని యూట్యూబు క్లిప్పులు చూశాక అర్థమైంది. ఆ ఉత్సాహంతోనే ఇతగాడు తెలుగులో ఏమన్నా పాడాడా అని గూగుల్ లో వెతికాను. అష్టా చెమ్మా, అందరికీ బంధువయా అనే సినిమాల్లో ఒకటి రెండు పాటలు తప్ప మరేమీ కనిపించలేదు. పైగా తన అభిమాన గాయకులుగా కిషోర్ కుమార్ నీ లతా మంగేష్కర్ నీ చెప్పుకున్నాడే గానీ మన తెలుగువెలుగులైన ఘంటసాల సుశీల బాలసుబ్రహ్మణ్యాలు ఆయనకి గుర్తుకు రాలేదు. సరే సుశీలా ఘంటసాలలు పాతవాళ్ళనుకుందాము. SPB కిషోర్ కుమార్ కేం తీసిపోయాడు? SPB సృష్టించిన ఒరవడిలో నడవాలని ఆయనే ఆదర్శమనీ ప్రతి జూనియర్ సీనియర్ లలిత సంగీత గాయకుడూ (అన్ని భాషల వాళ్ళూ) గుండెలమీద చెయి వేసుకు చెప్పుకుంటాడు. ఓ తెలుగు వాడైన పాపానికి ఈ తెలుగు చిన్నవాడు చెప్పుకోడానికి సిగ్గుపడిపోయాడా?

నిజం చెప్పాలంటే మైనంపాటీ శ్రీరాం తెలుగువారి అభిమానానికి అపాత్రుడు. అతని అమ్మమ్మ తోనూ బామ్మతోనో తెలుగులో మాట్లాడితే సరిపోదు. తెలుగు వాళ్ళందరితోనూ తెలుగులో మాట్లాడి తెలుగులో పాడి తెలుగు ప్రజలని మెప్పించినప్పుడే అతను తెలుగు ప్రజల అభిమానానికి పాత్రుడౌతాడు.

నాకైతే ఇటీవలికాలంలో మాటీవీ ద్వారా Super Singer కార్యక్రమాల్లో పరిచితులైన శ్రీ కృష్ణ, దీపు, కౌశిక్ కళ్యాణ్, రేవంత్, ధీరజ్ ప్రభృతులు ఎంతగానో నచ్చారు. వాళ్ళందరూ నిజంగా తెలుగు తల్లి ముద్దుబిడ్డలు. శ్రీకృష్ణ ఆ కార్యక్రమం చివరిలో అన్నట్టుగా అశేషాంధ్ర ప్రజానీకం హృదయాలలో చోటు సంపాదించుకున్నారు, కేవలం SMS కీ నొక్కుడులు కాదు.

- తాడేపల్లి హరికృష్ణ

Anonymous said...

> కానీ ఒకళ్లు request చేసిన తర్వాత కూడా అతను తెలుగు కి అంత ప్రాముఖ్యత ఇవ్వకపోవటం నాకు నచ్చలేదు

-- అలా చేసాడు కాబట్టే అతడు తెలుగు వాడని అ౦దరికీ నమ్మక౦ కుదురి౦ది.

ప్రేమిక said...

బాసూ.. మనం గెలిపించాల్సింది తెలుగు వాడనో లేక మా పక్కింటి వాడనో కాదు.. టాలెంట్ ని... శ్రీరాం లో ఆ సత్తా ఉంది... అందుకే గెలిచాడు.. ఇక మీరు అన్నారు తెలుగులో మట్లాడలేదు అని... ఆ పరిస్థితి లో ఎవరున్నా అలాగే చేస్తారు.. ఇక బాలీవుడ్ జనాలకి రజనీ డైలాగ్ చెప్తేనే బెటర్ ఏమో కొంచం ఆలోచించండి

Anonymous said...

hi